Ring Nets Controversy In Visakhapatnam: విశాఖపట్నంలో మత్స్యకారుల మధ్య మరోసారి రింగు వలల వివాదం రాజుకున్న విషయం తెలిసిందే! శుక్రవారం తెల్లవారుజామున వాసవానిపాలెంలో రింగు వలలతో కూడిన పడవలకు నిప్పు పెట్టడం, ఇది పెద్దజాలరిపేటకి చెందిన మత్స్యకారులే పనే అయ్యుంటుందని వారి మూడు పడవల్ని తీసుకురావడంతో వివాదం నెలకొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, మత్స్యకార పెద్దలతో ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
తీరానికి తీసుకొచ్చిన పడవల్ని తిరిగి ఇచ్చేయాలని పోలీసులు కోరితే, తమ వలలకు నిప్పు పెట్టిన వారిని అరెస్ట్ చేయాలంటూ వాసవానిపాలెం గ్రామపెద్దలు తేల్చి చెప్పారు. ఒకానొక సమయంలో పోలీసులు, అధికారులపై మత్స్యకారులు తిరగబడేందుకు సిద్ధమవ్వడంతో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో.. వాసవానిపాలెం, పెద్దజాలరిపేట గ్రామాల్లో 144 సెక్షన్ను అమల్లోకి తెచ్చారు. ఐదు పోలీసు పికెటింగ్లను సైతం ఏర్పాటు చేశారు. శుక్రవారమే ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించగా.. ఫలితం దక్కలేదు.
తద్వారా ఈరోజు (శనివారం) మరోసారి మత్స్యకార పెద్దలతో మంత్రి సీదిరి అప్పలరాజు సమావేశం నిర్వహించనున్నారు. సాంప్రదాయ, రింగ్ వలలు మత్స్యకారులు మధ్య జెంటిల్మెన్ ఒప్పందాన్ని కుదుర్చనున్నారు. కాగా.. రెండో రోజు రింగ్ వలలు వేటకు వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.