Minister Anagani Satyaprasad: ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో 22ఏ భూములపై చర్చ సాగుతోన్న వేళ.. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ భూ సమస్యల పరిష్కారంపై కీలక ప్రకటనలు చేశారు. నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ప్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు నేటి నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అక్రమాలు చోటుచేసుకున్నట్లు గుర్తించిన మరో 4 లక్షల ఎకరాల ప్రీహోల్డ్ భూములపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు. శతాబ్దాలుగా, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తున్నామని మంత్రి తెలిపారు. వట్టిచెరుకూరు, శెట్టిపల్లి, పుల్లడిగుంట, కంగుంది, అవులపల్లి, గూటుపల్లి, కోనసీమ జిల్లాల్లోని నాలుగు ప్రాంతాల్లో వేలాది మందికి వారి ఆస్తులపై సంపూర్ణ హక్కులు కల్పించినట్లు చెప్పారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కక్షపూరితంగా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన 28 లక్షల ఎకరాలను ఆ జాబితా నుంచి తొలగించినట్లు మంత్రి పేర్కొన్నారు. 22ఎ జాబితా నుంచి భూముల తొలగింపు ప్రక్రియను సులభతరం చేస్తూ జీవో నెం.444 ద్వారా సమగ్ర ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు అనగాని.. జీవో 444 తర్వాత 22ఏ జాబితా నుంచి 28,790 ఎకరాలను తొలగించాలని దరఖాస్తులు వచ్చాయని, వాటిలో ఇప్పటివరకు 1,100 ఎకరాలను తొలగించినట్లు మంత్రి వెల్లడించారు. మిగిలిన దరఖాస్తులపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
అదేవిధంగా కొత్తగా ఏదైనా భూమిని 22ఎ నిషేధిత జాబితాలో చేర్చేందుకు స్పష్టమైన విధివిధానాలను రూపొందిస్తూ జీవో నెం.445 జారీ చేసినట్లు అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఏదైనా ప్రైవేట్ భూమిని 22ఎ జాబితాలో చేర్చాలంటే, ఆ భూమి నిషేధిత జాబితాలో చేర్చాల్సిన కారణాలను సంబంధిత అధికారే నిరూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ భూమిని 22ఎ జాబితాలో చేర్చే అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ‘మీ భూమి–బ్లాక్చెయిన్ టెక్నాలజీ’ ప్రాజెక్ట్ను అమలు చేస్తున్నామని వెల్లడించారు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్.

