AP High Court: పేకాటకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌.. హైకోర్టు కీలక ఆదేశాలు

  • పేకాట అనుమతి కోసం పిటిషన్లు వేసిన 3 క్లబ్‌లకు హైకోర్టు షాక్‌..
  • 13 కార్డ్స్ కు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్లు..
  • డబ్బులు పెట్టి ఆడటానికి వీల్లేదని ఏపీ హైకోర్టు ఆదేశాలు..
  • డబ్బులు పెట్టి పేకాట ఆడటం చట్ట విరుద్ధమన్న న్యాయస్థానం
Ap High Court

Ap High Court

AP High Court: పేకాట అనుమతి కోసం పిటిషన్లు వేసిన మూడు క్లబ్‌లకు షాక్‌ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. 13 కార్డ్స్‌కు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి భీమవరం కాస్మోపాలిటన్‌ క్లబ్‌, లార్డ్‌ హోర్డింగ్‌ హాల్‌ టౌన్‌ క్లబ్‌, నర్సాపురం యూత్‌ క్లబ్‌.. అయితే, విచారణ సందర్భంగా కీలక ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు.. డబ్బులు పందెంగా పెట్టి కార్డ్స్‌ ఆడటం చట్ట విరుద్ధమని న్యాయస్థానం స్పష్టం చేస్తూ, క్లబ్‌ల విజ్ఞప్తిని తిరస్కరించింది. క్లబ్‌ల తరఫు న్యాయవాది సుప్రీం కోర్టు తీర్పుల ఆధారంగా 13 కార్డ్స్‌ రమ్మీకి అనుమతి ఇవ్వాలని వాదనలు వినిపించారు. అయితే, విచారణ అనంతరం హైకోర్టు ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డబ్బులకు పేకాట ఆడటానికి వీల్లేదని, అలా ఆడితే అది గాంబ్లింగ్ యాక్ట్ సెక్షన్ 3, 4 కింద చట్టవిరుద్ధ చర్యగా పరిగణించి కేసులు నమోదు చేయాల్సిందే అని తెలిపింది. ఇటీవల కూడా ఇలాంటి కేసుల్లో ఇదే తరహా ఆదేశాలు ఇచ్చాం అని బెంచ్‌ గుర్తుచేసింది.

Read Also: Dhurandhar vs The Raja Saab: దురంధర్ రికార్డులను ‘రాజా సాబ్’ బద్దలు కొడతాడా..?

ఇప్పటికే నూజివీడు మాంగో బే క్లబ్ దాఖలు చేసిన మరో పిటిషన్‌పై కూడా హైకోర్టు గతంలో స్పష్టత ఇచ్చింది. 13 కార్డ్స్ రమ్మీని డబ్బులకు ఆడొద్దు, ఆడితే గాంబ్లింగ్ యాక్ట్ 3, 4 కింద చర్యలు తీసుకోవాలి అని జిల్లా పోలీస్‌, యంత్రాంగానికి అప్పుడే ఆదేశాలు ఇచ్చినట్లు కోర్టు పేర్కొంది. నేటి విచారణలోనూ ఈ మూడు క్లబ్‌ల పిటిషన్ల విషయంలో కూడా అదే చట్టపరమైన నియమాలు వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతో పేకాటను డబ్బులకు ఆడేందుకు చట్టబద్ధత ఇవ్వాలని చూసిన ప్రయత్నానికి బ్రేక్ పడింది. దీంతో ఇకపై క్లబ్‌లు, వ్యక్తులు ఎవరైనా డబ్బులు పెట్టి 13 కార్డ్స్‌ లేదా రమ్మీ ఆడితే అది గ్యాంబ్లింగ్‌ కింద నేరమే అవుతుందని హైకోర్టు మరోసారి తేల్చి చెప్పింది.