Minister Satyakumar Yadav: ఆరోగ్యశ్రీ క్రెడిట్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిదే.. మంత్రి సత్యకుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Satya Kumar Yadav

Satya Kumar Yadav

Minister Satyakumar Yadav: విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గత రెండేళ్లలో శాఖ సాధించిన పురోగతి, చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ లక్ష్యాలపై వివరాలు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పథకం నుంచి 108 అంబులెన్స్ సేవలు, వైద్య సిబ్బంది నియామకాలు, సాంకేతికత వినియోగం వరకు పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకానికి క్రెడిట్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని స్పష్టం చేశారు. పథకాలకు పేర్లు పెట్టడం తప్పు కాదని, పేర్లు మారినా పథకం మారదని అన్నారు. ఆరోగ్యశ్రీపై మాజీ సీఎం జగన్ అనవసర దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చదువుకున్నవారు అసత్య ప్రచారం చేస్తే ప్రజలు భయపడి ఆసుపత్రులకు వెళ్లకుండా ఉండే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

108 సేవల్లో గణనీయమైన మెరుగుదల

గత ప్రభుత్వ హయాంలో కేవలం 602 అంబులెన్సులు మాత్రమే పనిచేశాయని, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 733 అంబులెన్సులు సేవలందిస్తున్నాయని తెలిపారు సత్యకుమార్‌. అన్ని అంబులెన్సులకు జీపీఎస్ వ్యవస్థను అమర్చినట్లు చెప్పారు. గతంలో 108 అంబులెన్స్ సంఘటన స్థలానికి చేరుకోవడానికి సగటున 27.3 నిమిషాలు పట్టేదని, ప్రస్తుతం ఆ సమయం 17 నిమిషాలకు తగ్గిందన్నారు. గిరిజన ప్రాంతాల్లో కూడా 23 నిమిషాల్లో అంబులెన్స్ సేవలు అందుతున్నాయని వివరించారు. గోల్డెన్ అవర్ కాల్స్ 95 శాతం పెరిగాయని, మోర్టాలిటీ రేటు దాదాపు 10 శాతం తగ్గిందని వెల్లడించారు.

×
×
Ad

సాంకేతికతతో ఆరోగ్య సేవలకు కొత్త దిశ

రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి సాంకేతికతను అనుసంధానం చేసినట్లు మంత్రి తెలిపారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద ప్రోత్సాహకాలు అందించామని, వాక్-ఇన్ ఇంటర్వ్యూల ద్వారా సెకండరీ హెల్త్ సెక్టార్‌లో నియామకాలు చేపట్టామని చెప్పారు. గుండె జబ్బులకు సంబంధించి STEMI విధానాన్ని సమర్థంగా అమలు చేయడంతో గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి చేరిన కేసుల్లో 94 శాతం విజయవంతమైన చికిత్స అందించగలిగామని పేర్కొన్నారు సత్యకుమార్‌.

12 వేల మంది నియామకాలు

వైద్య ఆరోగ్యశాఖలో 12 వేల మందిని పారదర్శకంగా నియమించామని మంత్రి తెలిపారు. అత్యంత అవసరమైన సందర్భాల్లో మాత్రమే బదిలీలు చేశామని, తాను బదిలీల విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని అన్నారు. ఇక, గుంటూరును రాష్ట్రంలో నంబర్-1 క్యాన్సర్ సెంటర్‌గా అభివృద్ధి చేశామని వెల్లడించారు.. త్వరలో అనంతపురం, కాకినాడలో కూడా అత్యాధునిక క్యాన్సర్ కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అలాగే ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్ కింద ప్రతి మూడు రోజులకు ఒక కొత్త డయాలసిస్ బెడ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు..

పెరుగుతున్న వ్యాధులపై ఆందోళన

రాష్ట్రంలో లివర్ సంబంధిత కేసులు 250 శాతం పెరిగాయని, కిడ్నీ సంబంధిత కేసులు ఒకే ఏడాదిలో 23,555 నమోదయ్యాయని మంత్రి తెలిపారు. మానసిక ఆరోగ్య సమస్యలు కూడా 20 రెట్లు పెరిగాయని పేర్కొన్నారు. ఇక, రాష్ట్రంలో 11.96 కోట్ల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. ఇది దేశంలోనే అత్యధికమని పేర్కొన్నారు. భవిష్యత్తులో జన్యు సంబంధిత వ్యాధులపై ప్రత్యేక సర్వే నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నివారణ చర్యలు చేపడతామని తెలిపారు.

ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యం

ప్రభుత్వ ఆసుపత్రులను వినియోగించుకునే రోగుల సంఖ్యను పెంచడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు సత్యకుమార్‌… ఆరోగ్యవంతమైన మానవ వనరులను పెంపొందించడం ద్వారా “ఆరోగ్యాంధ్రప్రదేశ్ – వికసిత భారత్” లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగిని వైద్య సిబ్బంది చిరునవ్వుతో ఆహ్వానించాలని సూచిస్తూ, సేవల నాణ్యత పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్..