Minister Ram Prasad Reddy Emotional: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో అనూహ్యంగా భావోద్వేగ పరిస్థితి నెలకొంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై జరిగిన చర్చలో… రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లి కేంద్రంగా మార్చే అవకాశం ఉందన్న ప్రతిపాదన తెరపైకి రావడంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర ఆవేదనకు గురై, సమావేశంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రి ఆవేదనను గమనించిన సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే ఆయనను ఓదార్చినట్టు కేబినెట్ వర్గాలు తెలిపాయి. రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలని మంత్రి గట్టిగా కోరినట్టు సమాచారం.
Read Also: Indonesia: ఇండోనేసియాలో ఘోర అగ్నిప్రమాదం.. వృద్ధాశ్రమంలో 16 మంది సజీవదహనం
మరోవైపు, సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడేందుకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి నిరాకరించారు. సచివాలయం నుంచి బయటకు వచ్చిన ఆయన.. రాయచోటిపై ప్రశ్నలు ఎదురుకాగానే మరింత ఉద్వేగానికి లోనై, కన్నీళ్లతోనే కారులో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. జిల్లా కేంద్రంపై జరుగుతున్న పరిణామాలపై ఆయన మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు కనిపించింది. రాయచోటి–మదనపల్లి మధ్య జిల్లా కేంద్రం అంశం ఇప్పటికే స్థానికంగా సున్నితమైన అంశంగా మారింది. తాజాగా మంత్రి కన్నీటి ఘటనతో ఇది మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాల పునర్విభజన ప్రక్రియలో ప్రజల అభిప్రాయాలు, పాలన సౌలభ్యం, భౌగోళిక సమీకరణ వంటి అంశాలను పరిశీలిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే, స్థానిక నేతలు, ప్రజల్లో నెలకొన్న భావోద్వేగాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
