భారతీయ జ్యోతిష్య సంప్రదాయం ప్రకారం ఒక్కో నక్షత్రం, కార్తె, రాశికి ప్రత్యేకత ఉంటుంది. అందులో మృగశిరానికి మరింత విశిష్టత ఉన్నది.

రోహిణి కార్తెతో రోళ్లు పగిలే ఎండలతో సతమతమైన జీవకోటికి మృగశిరం చల్లని కబురును చెబుతుంది. 

సూర్యుడు మృగశిరంలోకి ప్రవేశంచడంతో ఆ కార్తెను మృగశిరకార్తెగా పిలుస్తారు. ప్రతి ఏడాది జూన్‌ మాసంలో జరుపుకొంటారు.

కార్తెలో చేపలు విరివిగా తినడం వల్ల చాలా రోగాలు నయమవుతాయనే నమ్మకంతో అదే రోజున చేపమందును తీసుకోవడం కూడా ఆనవాయితీగా వస్తోంది. 

మృగశిర కార్తెలో చేపలు తినడం మన పెద్దల నుంచి వస్తున్న ఆనవాయితీ. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో వేడిని పుట్టించేందుకు చేపలను తింటారు. 

చేపలు తినడం వల్ల ఉబ్బసం, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. అలాగే కొత్త నీరు వచ్చి చేరడంతో రోగాలు సోకే అవకాశం ఉన్నది. రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. 

రోగాల బారి నుంచి కాపాడుకుంటూ, రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలంటే చేపలు తినాల్సిందేనని పెద్దలు చెప్తుంటారు. ఈక్రమంలో చేపలకు ఫుల్‌ డిమాండ్‌ ఉంటుంది.

అంతేకాక మృగశిర కార్తెకు పురాణాల్లో కూడా ఎంతో విశిష్టత ఉన్నది. ఈ కార్తె గురించి భగవద్గీత, పురాణాల్లో ప్రత్యేక స్థానం ఉండడం విశేషం.

మృగశిర కార్తె మొదటి రోజును దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర, మృగం, మిరుగు, మిర్గం అనే పేర్లతో పిలుస్తారు. ఈ రోజు బెల్లంలో ఇంగువను కలుపుకుని తింటారు. 

బెల్లంలో ఇంగువను కలుపుకుని తినడం వల్ల శరీరంలో ఊష్ణోగ్రతను ప్రేరేపించి వర్షాకాలంలో సోకే వ్యాధులను అడ్డుకుంటుందని పెద్దల నమ్మకం.