చలితీవ్రత పెరగడంతో నగర వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రోజంతా మబ్బుపట్టి.. సన్నని గాలులతో చలి గజగజలాడిస్తోంది. దీంతో ఎక్కువగా అలర్జీలు దాడి చేస్తున్నాయి. 

శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్న వారు మరింత ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు చాలా మంది అలర్జీల బారినపడి ఆసుపత్రిలో చేరుతున్నారు.

ఎక్కువ మందిలో జలుబు, పొడి దగ్గు, ముక్కు కారటం, వరుసగా తుమ్ములు, కళ్ల నుంచి నీరు కారడం, కళ్లల్లో దురద తదితర లక్షణాలు ఉంటున్నాయి. దీనినే అలెర్జిక్‌ రైనైటీస్‌గా భావించాలని వైద్యులు పేర్కొంటున్నారు. 

ఛాతిలో బరువు, ఆయాసం, జ్వరం, పిల్లి కూతలు లాంటి లక్షణాలు ఉంటే ఆస్తమాగా భావించి వెంటనే వైద్యులను సంప్రదించాలి

ఈ కాలంలో ఇంట్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దుమ్ము ధూళిని శుభ్రం చేసేటప్పుడు మాస్క్‌ ధరించడం వల్ల అలర్జీల బారిన పడకుండా చూసుకోవచ్చు. 

 సైనస్‌, ఆస్తమా సమస్యలు ఎదుర్కొంటున్న వారు బాగా పుల్లగా ఉన్న పండ్లు తింటే సమస్య మరింత పెరుగుతుంది.

ఈ సీజన్‌లో ఆస్తమా, సీవోపీడీ లాంటి సమస్యల వల్ల శ్వాస ఆడకపోవడం ఇతర ఇబ్బందులు ఎదురవుతాయి. ఇండోర్‌ అలర్జీలు ఆస్తమా సమస్యలను ప్రేరేపిస్తాయి. వీటిపట్ల జాగ్రత్తగా ఉండాలి.

అధిక చలిలో ముక్కు, చెవుల్లో ఇన్‌ఫెక్షన్లు కూడా వస్తాయి. ఉదయం వాకింగ్‌కు వెళ్లే వాళ్లు ఎండ వచ్చిన తర్వాత చేయడం మంచిది. చెవిలో నొప్పి ఎక్కువగా ఉంటే మాత్రం ఈఎన్‌టీ నిపుణులకు చూపించాలి.

చల్లని గాలి, పొడి వాతావరణం వల్ల గాలిలో తేమ తగ్గడం వల్ల పెదవులు, ముఖం, చర్మం పొడి బారుతుంటాయి. దురద వల్ల గోకితే పుండ్లు పడతాయి. కొబ్బరి నూనె ఇతర మాయిశ్చరైజర్లతో చర్మం పొడిబారిపోకుండా చూసుకోవాలి.

చలికాలంలో చాలామంది నీళ్లు తాగడం మానేస్తుంటారు. యూరిన్‌ ఇన్‌ఫెక్షన్లకు ఇది దారి తీస్తుంది. దాహం లేకపోయినా 7-8 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. ఫలితంగా చర్మం కూడా మృదువుగా ఉంటుంది.

ముఖ్యంగా ఛాతి పట్టేసినట్లు ఉండటం, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం రెండు, మూడు రోజుల కంటే ఎక్కువగా ఉంటే న్యుమోనియా కింద భావించాలి. వెంటనే వైద్యులను సంప్రదించాలి. 

పిల్లలు, వృద్ధులు, గర్భిణుల విషయంలో చలికాలంలో అప్రమత్తంగా ఉండాలి.