ఈ నెల 2వ తేదీన కరీంనగర్లో బీజేపీ చీఫ్ బండి సంజయ్ను కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ అరెస్ట్ను నిరసిస్తూ.. బీజేపీ శ్రేణులు నేడు సాయంత్రం సికింద్రాబాద్ నుంచి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ.. ముందుగా నిర్ణయించిన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ ర్యాలీ నిర్వహిస్తోందని ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమం యధావిధిగా సాయంత్రం 5 గంటలకు జరుగుతుందని, ఈ కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని కోరుతున్నామన్నారు. సికింద్రాబాద్ మహాత్మాగాంధీ విగ్రహం నుండి ప్యారడైజ్ సర్కిల్ వరకు నిర్వహిస్తున్న ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పాల్గొంటారని ఆయన తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్పోర్టులో సాయంత్రం దిగుతారని, అక్కడి నుండి నేరుగా సికింద్రాబాద్ మహాత్మ గాంధీ విగ్రహం వద్దకు రోడ్డు మార్గంలో విచ్చేస్తారని ఆయన పేర్కొన్నారు.