ఆ ఆరుగురు ఎవరు? ఎవరికి అధికారపార్టీ పట్టం కడుతుంది? పదవీకాలం ముగిసిన వారిలో రెన్యువల్ అయ్యేది ఎందరు? ఎమ్మెల్యే పదవులపై ప్రస్తుతం ఇదేచర్చ. రకరకాల పేర్లు.. సమీకరణాలు.. చర్చలు గులాబీ శిబిరంలో వేడి పుట్టిస్తున్నాయి.
టీఆర్ఎస్లో ఎమ్మెల్సీ ఛాన్స్ దక్కేదెవరికి?
తెలంగాణ శాసనమండలిలోని ఆరుఎమ్మెల్సీ ఖాళీల భర్తీకి షెడ్యూల్ రావడంతోనే.. గులాబీ శిబిరంలో అలజడి మొదలైంది. అన్నీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు కావడంతో.. ఆరుకు ఆరు టీఆర్ఎస్కే దక్కుతాయి. అధికారపార్టీ పెద్దల ఆశీసులు ఉంటే చాలు… చట్టసభలో ఆరేళ్లపాటు ఎమ్మెల్సీగా ఉండొచ్చు. అయితే పదవీయోగం కలిగిన ఆ ఆరుగురు టీఆర్ఎస్లో ఎవరన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
గుత్తాకు రెన్యువల్ ఉండొచ్చని పార్టీ వర్గాల టాక్..!
ఎమ్మెల్సీలుగా పదవీకాలం ముగిసి..తాజా మాజీలుగా మారిన వారిలో మండలి ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా పనిచేసిన గుత్తా సుఖేందర్రెడ్డి, నేతి విద్యసాగర్రావులు ఉన్నారు. పార్టీ నేతలు బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలితలు సైతం మాజీలయ్యారు. ఈ ఆరుగురిలో రెన్యువల్ ఎంతమందికి అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఒకరిఇద్దరికి మరోసారి ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతున్నా.. పేర్లు బయటకు రావడం లేదు. ఆ ఇద్దరి పేర్లు చర్చల్లో బలంగా వినిపిస్తున్నా.. చివరి వరకు సస్పెన్సే. గుత్తా పేరు మాత్రం రేస్లో ముందుంది.
పార్టీ అవసరాల మేరకు పేర్లు వడపోతలు..!
ఎమ్మెల్యే కోటాలోని ఈ ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎప్పుడో నోటిఫికేషన్ రావాలి. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు ఈసీ ఎట్టకేలకు షెడ్యూల్ రిలీజ్ చేయడంతో.. గులాబీ దళపతి నుంచి ఎమ్మెల్సీ హామీ పొందిన వారు ఆశగా ప్రగతిభవన్ వైపు చూస్తున్నారు. ఇదే సమయంలో ఆశావహుల సంఖ్య కూడా పార్టీలో ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం పదవీకాలం ముగిసిన వారిలో పనితీరు.. సామాజిక సమీకరణాలు.. జిల్లాలను దృష్టిలో పెట్టుకుని పిలుస్తారని అనుకుంటున్నారు. పార్టీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వడపోతలు ఉంటాయని సమాచారం.
పెద్దలకు సన్నిహితంగా ఉండేవారి దగ్గర నేతల ఆరా..!
టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. చాలా మందికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. వారంతా ఇదిగో అదిగో అన్నట్టు ఎదురు చూస్తున్నారు. ఖాళీ సీట్లు ఆరు ఉంటే.. అంతకు మూడు నాలుగింతలు మంది క్యూలో ఉన్నారు. ఈ దఫా తప్పక ఎమ్మెల్సీని చేస్తారని పార్టీ నేతలు ధైర్యంగా చెప్పుకొనే పరిస్థితి లేదు. పిలుపు వచ్చే వరకు ఉత్కంఠే. అందుకే పార్టీలో పెద్దలకు సన్నిహితంగా ఉండే నాయకుల దగ్గర ఆరా తీస్తున్నారట ఆశావహులు. మరి.. ఎవరికి ఛాన్స్ ఇస్తారో… ఎవరికి రెన్యువల్ ఉంటుందో నామినేషన్ల దాఖలు వరకు ఆగాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు.