తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఉల్లంఘనలకు విధించిన చలాన్లు లేదా జరిమానాల ద్వారా రూ.366.08 కోట్ల రూపాయలను సేకరించినట్లు సమాచార హక్కు (ఆర్టీఐ) ద్వారా వెల్లడైంది. అయితే అమ్జాద్ ఖాన్ అనే వ్యక్తి పోలీసుల చలాన్ల ఆదాయంపై ఆర్టీఐలో దరఖాస్తు చేశాడు. ఈ నేపథ్యంలో అమ్జాద్ ఖాన్ కు పోలీసు శాఖ చలాన్లు, జరిమానాలకు సంబంధించిన వివరాలను అందజేసింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు ఏప్రిల్ 1, 2020 నుండి సెప్టెంబర్ 30, 2021 మధ్య ఈ మొత్తాన్ని సేకరించినట్లు వెల్లడించారు.
అయితే ఏప్రిల్ 2020 నుండి మార్చి 2021 మధ్య పోలీసు శాఖ రూ. 208 కోట్ల జరిమానాలను వసూలు చేసింది. అంతేకాకుండా ఏప్రిల్ 2021 నుండి సెప్టెంబర్ 2021 మధ్య రూ.158.33 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఇదే సమయంలో సైబరాబాద్ పోలీసు పరిధిలో అత్యధికంగా రూ.53.26 కోట్లు చలాన్లు వసూలు చేసి మొదటిస్థానంలో ఉంది. అదేవిధంగా ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రూ.35 కోట్ల జరిమానా వసూలు చేసి రెండో స్థానంలో నిలిచారు. ట్రాఫిక్ పోలీసులకు అత్యల్పంగా జిల్లా జయశంకర్ భూపాలపల్లి నుంచి రూ.30.36 కోట్లు లభించింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్, హైదరాబాద్లలో ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎక్కువగా ఉండడంతో ట్రాఫిక్ పోలీసులు భారీగా చలాన్లు విధిస్తున్నట్లు తెలుస్తోంది.