ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ వ్యూహం పనిచేస్తుందా?
తెలంగాణలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ వ్యూహం ఏంటి? రెండుచోట్ల ఎన్నికలు జరుగుతుంటే.. ఒక దగ్గరే అభ్యర్థిని ప్రకటించి.. మరోచోట ఎందుకు పెండింగ్లో పెట్టింది? హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర స్థానంలో టీఆర్ఎస్ పోటీ చేస్తుందా లేదా?
ఎన్నికల షెడ్యూల్ రాకముందే పల్లా పేరు ప్రకటన!
నల్లగొండ-ఖమ్మం-వరంగల్తోపాటు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఒకేసారి షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 14న పోలింగ్ జరుగుతుంది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్రెడ్డి.. అక్కడి నుంచి మళ్లీ పోటీ చేస్తారని ప్రకటించింది టీఆర్ఎస్. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రాకముందే పల్లా విషయంలో స్పష్టమైన ప్రకటన చేయడంతో ఆయన ప్రచారంపై ఫోకస్ పెట్టారు. ఆ మూడు జిల్లాల ప్రజాప్రతినిధులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం రోజుకో సమావేశం ఏర్పాటు చేసి ప్రచారంలో బిజీగా ఉంటున్నారు పల్లా.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో టీఆర్ఎస్ పోటీ చేయదా?
హైదరాబాద్-మహబూబ్నగర్-రంగారెడ్డి గ్రాడ్యుయేట్ అభ్యర్థి విషయంలో టీఆర్ఎస్ నోరు మెదపడం లేదు. షెడ్యూల్ వచ్చినా తమకు సంబంధం లేదన్నట్టే వ్యవహరిస్తోంది. తొలుత ఇక్కడ ఎవరు పోటీ చేయాలన్నదానిపై కొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత అంతా సైలెంట్ అయిపోయారు. ఈ స్థానంలో టీఆర్ఎస్ పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదట. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి టిఆర్ఎస్ తరఫున ఉద్యోగుల సంఘం నేత దేవీప్రసాద్ పోటీ చేసి బీజేపీ నేత రామచంద్రరావు చేతిలో ఓడిపోయారు.
లెఫ్ట్ అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్కు టీఆర్ఎస్ మద్దతు?
గతంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పనిచేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ దఫా వామపక్షాల అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మధ్యలో ఒకసారి నాగేశ్వర్ ఓడిపోయారు. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి ఆఫర్ వచ్చినా లెఫ్ట్ పార్టీల నుంచే బరిలో దిగారాయన. ప్రశ్నించే గొంతును గెలిపించండి అని ప్రచారం మొదలుపెట్టారు ప్రొఫెసర్. అయితే.. ఈ స్థానంలో బీజేపీ ఓటమి కోసం అంతర్గతంగా నాగేశ్వర్కు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ ఆలోచిస్తోందట. గ్రాడ్యుయేట్లలో ప్రభుత్వంపై అసంతృప్తి ఉందని.. తాము గెలవలేకున్నా.. బీజేపీ మాత్రం గెలవొద్దని టీఆర్ఎస్ ఆలోచిస్తోందట.
టీఆర్ఎస్ శ్రేణులకు క్లారిటీ వచ్చేసిందా?
కొన్నాళ్ల క్రితం ప్రొఫెసర్ నాగేశ్వర్ రైతు చట్టాలపై సీఎం కేసిఆర్తో భేటీ అయ్యారు. ఆ సమావేశంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతుపై అవగాహన కుదిరినట్టు తెలుస్తోంది. దీంతో ఇక టీఆర్ఎస్ పరోక్ష మద్దతు నాగేశ్వర్కే అన్న క్లారిటీ టీఆర్ఎస్ శ్రేణులకు వచ్చేసిందట. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి చిన్నారెడ్డి, టీడీపీ నుంచి టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ సభ్యుడు రామచంద్రరావు మరోసారి బీజేపీ నుంచి బరిలో ఉండటంతో... ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్కు టీఆర్ఎస్ మద్దతిస్తే పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)