కొత్త పాలసీ ఎఫెక్ట్.. వాట్సాప్కు కష్టాలు..!
వాట్స్యాప్ వ్యక్తిగత గోప్యతా విధానంపై మొదలైన వివాదం... దాని ప్రత్యర్థులకు వరంగా మారింది. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్లో సిగ్నల్, టెలిగ్రాంల డౌన్లోడ్లు విపరీతంగా పెరిగాయి. ఈ నెల 5 నుంచి 12 మధ్య గూగుల్, యాపిల్ స్టోర్ల నుంచి కోటి 78 లక్షల మంది సిగ్నల్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. అంతకు ముందు వారం 2 లక్షల 85 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. సిగ్నల్ తరహాలోనే టెలిగ్రాం యాప్కి సైతం గిరాకీ పెరిగింది. ఈ నెల 5 నుంచి 12 మధ్య కోటి 57 లక్షల మంది టెలిగ్రామ్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. అంతకు ముందు వారం 77 లక్షల డౌన్లోడ్లతో పోలిస్తే ఇది రెట్టింపు.
మరోవైపు... వివాదంలో చిక్కుకున్న వాట్స్యాప్ను వినియోగించే వాళ్ల సంఖ్య అనూహ్యంగా తగ్గిపోతోంది. ఈ నెల 5 నుంచి 12 మధ్య కోటి డౌన్లోడ్లు నమోదయ్యాయి. అంతుకు ముందు వారం కోటి 27 లక్షల డౌన్లోడ్లు జరగ్గా... వివాదం మొదలయ్యాయక 20 లక్షల డౌన్లోడ్లు తగ్గాయి. పరిస్థితిని చూస్తుంటే వినియోగదారులు ఫేస్బుక్కు ప్రత్యామ్నాయం చేస్తున్నట్టు కనిపిస్తోంది. మున్ముందు వాట్స్యాప్ వినియోగదారులు మరింత తగ్గే సూచనలున్నాయి. అయితే, తమ కొత్త ప్రైవసీ పాలసీపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో మరోసారి వివరణ ఇచ్చింది వాట్స్యాప్. తాజాగా తీసుకువచ్చిన మార్పులు స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపిన సందేశాల గోప్యతను ఏ విధంగానూ ప్రభావితం చేయవని తెలిపింది. కొత్త పాలసీపై తప్పుడు ప్రచారం జరుగుతుండడం వల్ల... వినియోగదారుల సందేహాలను పరిష్కరించాలని భావిస్తున్నట్టు తెలిపింది. వినియోగదారుల సందేశాలు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్తో భద్రంగా ఉంటాయని తెలిపింది వాట్స్యాప్. ఇండియాలో వాట్స్యాప్ను నిషేధించాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీంతో తమ ప్రైవసీ పాలసీపై ప్రభుత్వం అడిగే ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని వాట్స్యాప్ తెలిపింది. ఖాతాల ప్రైవసీ, సెక్యురిటీకి కట్టుబడి ఉన్నామని వివరించింది. అయితే, వాట్స్యాప్ చేపట్టిన నష్ట నివారణ చర్యలు పెద్దగా ఫలితమిచ్చే సూచనలు కనిపించడం లేదు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)