ఎమ్మెల్యేల కంటే వాలంటీర్లనే జనం ఎక్కువ ఆదరిస్తున్నారా?
ముందొచ్చిన చెవుల కంటే... వెనకొచ్చిన కొమ్ములు వాడిగా ఉంటాయన్న చర్చ చిత్తూరు జిల్లా పంచాయతీ ఎన్నికల్లో జోరందుకుంది. ఎమ్మెల్యేలకంటే పల్లెపోరులో వాలంటీర్లకే ఎక్కువ ఆదరణ లభిస్తుండటమే దీనికి కారణం. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం.
పంచాయతీ ఎన్నికల్లో వాలంటీర్లదే కీ రోల్?
చిత్తూరు జిల్లాలో అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఉహించిందే అయ్యిందనే మాటలు వినిపిస్తున్నాయి. వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రామాల్లో వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలకంటే వారికే ఎక్కువగా జనాల్లో ఆదరణ లభించింది. దీంతో వైసీపీ వారిని పట్టించుకునే వారు కరువయ్యారు. దీనిపై పార్టీలో పెద్ద చర్చే జరిగింది. ఎన్నికల్లో కష్టపడేది మేము.. పేరు వాలంటీర్లకా అని ఎమ్మెల్యేలను నిలదీసిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ స్థానిక వైసీపీ నేతలకంటే వాలంటీర్లే కీ రోల్ పోషించడంతో అనుకున్నదే అయ్యిందని చెవులు కొరుక్కుంటున్నారు అధికారపార్టీ నేతలు.
వాలంటీర్లకు కాసుల వర్షం కురిసిందా?
కొన్ని ప్రాంతాల్లో బరిలో ఉన్న అభ్యర్థులు.. తమ ప్రచారంలో పక్కన ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు అక్కర్లేదని.. వాలంటీర్లు ఉంటే చాలన్న సందర్భాలు కనిపించాయట. ఇది తెలుసుకున్న ఎమ్మెల్యేలు షాకైనట్టు సమాచారం. గ్రామస్థులతో వాలంటీర్లకు ఉన్న పరిచయాలను దృష్టిలో పెట్టుకుని బరిలో ఉన్న అభ్యర్థులు సైతం వారికి కొన్నిచోట్ల కాసుల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. ఇంటింటికీ వెళ్లినప్పుడు మా తరఫున ప్రచారం చేయండి చాలు.. గెలిచాక మేం మిమ్మల్ని చూసుకుంటాం అని ఇంకొన్నిచోట్ల హామీలు ఇచ్చారట.
పెద్దగా ఖర్చు పెట్టకుండానే ఎన్నికల్లో గెలిచిన వాలంటీర్లు!
కొందరు వాలంటీర్లు అయితే తమ ఉద్యోగాలకు రిజైన్ చేసి నేరుగా సర్పంచ్లుగా.. వార్డు మెంబర్లుగా బరిలో దిగిపోయారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి నియోజకవర్గం గంగాధరనెల్లూరులోని విజయపురం, వెదురుకుప్పంలో సర్పంచ్లుగా గెలుపొందింది వాలంటీర్లే. SR పురం మండలం ఉడమలకుర్తిలో చిట్టి అనే మహిళా వాలంటీర్ 18 నెలలపాటే ఆపనిలో ఉన్నారు. ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేసి 241 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఇక్కడ ఇంకో గమ్మత్తు ఉంది. సాధారణంగా రాజకీయ నేతలు ఎవరైనా పోటీ చేస్తే ఆ ఖర్చు ఈ ఖర్చు అని భారీగానే చేతి చమురు వదిలిపోతుంది. కానీ.. ఎన్నికల్లో పోటీ చేసిన వాలంటీర్లు మాత్రం పెద్దగా ఖర్చు పెట్టకుండానే గెలిచేశారట. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు .. వీళ్ల పనే బాగుంది అని నోరెళ్లబెట్టారట.
టీడీపీ నేతలూ వాలంటీర్ల సాయం తీసుకున్నారా?
ఇదే జిల్లాలోని కొన్నిచోట్ల ఎమ్మెల్యేలకు వాలంటీర్లు మరో రూపంలో షాక్ ఇచ్చారట. ఎన్నికల్లో పోటీ చేస్తాం మద్దతివ్వాలని వాలంటీర్లు కోరితే ఎమ్మెల్యేలు నో చెప్పారట. దాంతో మీ మద్దతు అక్కర్లేదు. రెబల్గా పోటీ చేస్తాం.. సత్తా చాటతాం అని ముఖం మీదే చెప్పినట్టు సమాచారం. దీనికితోడు అధికారపార్టీలో ఆధిపత్య పోరు ఉన్న చోట టీడీపీ నేతలు అలర్ట్ అయ్యారట. గుట్టుచప్పుడు కాకుండా వాలంటీర్లను బుట్టలో వేసుకుని గ్రామాల్లో పాగా వేసినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చినందుకు సంతోషపడాలో లేక ఏడ్వాలో తెలియడం లేదని పంచాయతీ పోరులో తలమునకలైన కొందరు వైసీపీ నేతలు ఆవేదన చెందుతున్నారట. మరి.. పంచాయతీ సమరం అయిన తర్వాత వాలంటీర్ల విషయంలో వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు గేరు మార్చుతారో.. ప్రేక్షకులుగానే మిగిలిపోతారో చూడాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)