ఏపీ ఎన్నికల్లో బంధుప్రీతిపై ఫోకస్ చేసిన ఎస్ఈసీ
ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో అధికారుల బంధుప్రీతి కనిపిస్తోందా?
ఎస్ ఈసీ అలాంటి ఆఫీసర్ల జాబితా తయారు చేసిందా?
బంధువులను ఎన్నికల్లో నిలబెట్టి, వాళ్ల తరపున పనిచేసిన వారిపై ఓ కన్నేసిందా? వారిపై చర్యలుంటాయా?
ఎన్నికల్లో అధికారులు, ఉద్యోగులు, అధికార పార్టీకి సహకరించడం, సహకరించారనే ఆరోపణలు రావడం రోటీన్. కానీ తమ బంధువులనే ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబెట్టి వారి గెలుపు కోసం కృషి చేయడం ఇక్కడ వెరైటీ. బంధు ప్రితితో డ్యూయల్ రోల్ పోషించిన అధికారులు.. ఉద్యోగుల జాబితాను ఎస్ఈసీ సిద్దం చేస్తోందట. తమకు అందిన కొన్ని కంప్లైంట్లు ఆధారంగా విచారణ జరిపిన అనంతరం ఎస్ఈసీ చర్యలు తీసుకోనుందని టాక్నడుస్తోంది.
పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ బిజీ బిజీగా ఉన్నాయి. ఏకగ్రీవాల హడావుడి ఓ వైపు, ఎన్నిక తప్పని చోట అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం మరో వైపు, ఇలా అధికార పార్టీ-ప్రతిపక్ష పార్టీలు పూర్తిగా ఎన్నికల హడావుడిలో ఉన్నాయి. అలాగే అధికార యంత్రాంగం కూడా ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అదే స్థాయిలో బిజీగా ఉంటోంది. పంచాయతీ ఎన్నికలు కావడంతో క్షేత్ర స్థాయి సిబ్బంది మొదలుకుని.. ఉన్నతాధికారి వరకు అందరికీ తలకుమించిన పని ఉంటోంది.
అయితే కొందరు అధికారులు మాత్రం అసలుతో పాటు కొసరు పనులతో మరింత బిజీగా ఉంటున్నారట. ఓవైపు అధికారిక విధులు నిర్వహిస్తూనే, రాజకీయ వ్యవహారాల్లోనూ తలమునకలవుతున్నారట. కొందరు ఉద్యోగుల బంధువులు ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో కొన్నిసార్లు గీత దాటి కూడా ఎన్నికల బరిలో ఉన్న తమ బంధువులకు సహకరిస్తున్నారట. తమ వాళ్లను గెలిపించుకోవాలనే ఆత్రంలో కొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ఈ తరహా డబుల్ యాక్షన్ చేస్తున్న ఉద్యోగులు, అధికారుల గురించి జిల్లాల్లోని ఉన్నతాధికారులకు.. ఎస్ఈసీకి కంప్లైంట్లు వెళ్లినట్టు టాక్ నడుస్తోంది. అలాంటి ఉద్యోగుల జాబితాను కూడా ఎస్ఈసీ సిద్దం చేస్తోందట. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఫిర్యాదులు మరీ ఎక్కువ వచ్చాయట. ప్రకాశం జిల్లాలో అయితే ఓ జిల్లా స్థాయి అధికారి మీదే కంప్లైంట్ వచ్చిందట.
ప్రకాశం జిల్లాలో డీపీఓగా విధులు నిర్వహిస్తున్న గోళ్లమూడి నారాయణ రెడ్డి తమ్ముడి భార్య గోళ్లమూడి శివకుమారి సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్ధిగా నిలబడ్డారు. కొడవకుదురు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడిన ఆమె విజయానికి తన అధికారాన్ని వినియోగించారనేది డీపీఓపై ఉన్న అభియోగం. జిల్లాలో ఎన్నికల నిర్వహణ అంతా డీపీఓ చేతుల మీదుగానే జరగాల్సి ఉంటుంది. ఓ అధికారి తమ్ముడి భార్య ఎన్నికల్లో నిలబడితే, అది కూడా పోటీ జరిగి గెలిస్తే తప్పేమిటనేది మరోవాదన.
ప్రకాశం జిల్లాలో అధికారి విషయంలోనే కాకుండా, ఇంకొందరిపై కూడా ఇదే తరహా ఆరోపణలు, ఫిర్యాదులు రావటంతో నిజానిజాలు తెలుసుకునే క్రమంలో ఎస్ ఈసీ జాబితా రెడీ చేస్తోందని సమాచారం.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)