ముంబై ఓపెనింగ్ జోడి పై స్పష్టత ఇచ్చిన కోచ్...
ఒక్కోసారి జట్టులో కొన్ని స్థానాల్లో ఆడటానికి సరైన ఆటగాళ్లు ఉండరు. దాంతో ఆ జట్టు ఇబ్బందులు పడుతుంది. అలాగే మరికొన్ని సార్లు ఒక్క స్థానానికి చాలా మంది ఆటగాళ్లు ఉంటారు. అప్పుడు కూడా జట్టు ఎవరిని ఎంపిక చేయాలా అనే ఇబ్బందులు పడుతుంది. ప్రస్తుతం ఓపెనర్ల విషయంలో ముంబై ఇండియన్స్ జట్టు పరిస్థితి ఇదే. ఈ జట్టులో ఓపెనర్లుగా డికాక్, రోహిత్, క్రిస్లిన్ వంటి ముగ్గురు అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. కానీ ఓపెనింగ్ కు వెళ్ళాల్సింది ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే. అందులో డికాక్ తో పాటుగా ఎవరు ఓపెనింగ్ చేయబోతున్నారు అని పెద్ద చర్చే జరిగింది. గత సీజన్లో డికాక్తో కలిసి రోహిత్, లిన్ ఇద్దరు కూడా కొన్ని కొన్ని మ్యాచ్ లు ఓపెనర్లు గా వచ్చారు. అందులో అందరూ అద్భుతంగా ఆడారు. దీంతో ఈసారి ఓపెనింగ్ జోడీ పై ఆసక్తి నెలకొంది. కానీ ఇప్పుడు ముంబై జట్టు కోచ్ మహేళ జయవర్దనే ఓపెనింగ్ జోడి పై స్పష్టత ఇచ్చాడు. ఈసారి రోహిత్ ఓపెనింగ్ చేస్తాడు అని చెప్పాడు. గత సీజన్లో డికాక్, రోహిత్ జోడీ మంచి ఫలితాలిచ్చింది. ఓపెనింగ్ విషయంలో మేము ముగ్గురితో మాట్లాడాము. అందులో ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకైనా సిద్ధమేనని రోహిత్, లిన్ చెప్పారు. దాంతో మేము రోహిత్ నే మరో ఓపెనర్ గా సెలక్ట్ చేసాము అని జయవర్దనే చెప్పాడు. ఇక మరి కొద్ది సమయంలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2020 మొదటి మ్యాచ్ లో ముంబై జట్టు చెన్నై తో తలపడనుంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)