అంబానీ అదుర్స్.. రూ.13,101 కోట్ల లాభం..
బిజినెస్ ఎలా చేయాలో అంబానీలను చూసి నేర్చుకోవాల్సిందే.. సంక్షోభ సమయంలోనూ లాభాలు ఏ మాత్రం తగ్గడం లేదు రిలయన్స్ ఇండస్డ్రీస్కు.. 2020-21 డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికానికి ముకేష్ అంబానీ నేతృత్వంలోని ఆర్ఐఎల్ నికర లాభం 12 శాతం వృద్ధి చెంది.. రూ.13,101 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ రిటైల్, జియో వ్యాపారాల జోరుతో పాటు ఆయిల్ టు కెమికల్ (ఓ2సీ) బిజినెస్ బాగా కలిసివచ్చింది. దీంతో.. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.11,640 కోట్లుగా ఉన్న ఆర్ఐఎల్ నికర లాభం.. ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది.. అయితే, గడిచిన 3 నెలల్లో మొత్తం ఆర్ఐఎల్ గ్రూప్ ఆదాయం మాత్రం రూ.1,28,450 కోట్లకు తగ్గింది.. మిగతా రంగాల పరిస్థితి ఎలా ఉన్నా.. ఆర్ఐఎల్ ఆదాయ లాభాల్లో జియో, రిటైల్ వాటా గణనీయంగా పెరిగింది. ఆర్ఐఎల్ మొత్తం ఆదాయంలో ఈ రెండింటి వాటా 51 శాతానికి పెరిగి.. స్థూల లాభంలో 56 శాతానికి చేరడం విశేషం.. ఇక, గత ఏడాది మార్చిలో రిలయన్స్ స్థూల రుణ భారం రూ.3,36,294 కోట్లుగా ఉంటే.. అదే డిసెంబర్ చివరి నాటికి రూ.2,57,413 కోట్లకు తగ్గింది. ఇదే సమయంలో నగదు నిల్వలు రూ.1,75,259 కోట్ల నుంచి రూ.2,20,524 కోట్లకు పెరిగినట్టు సంస్థ ప్రకటించింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)