పంచాయతీ ఎన్నికల్లో బోర్లాపడ్డ టీడీపీ సీనియర్ నేతలు...
అక్కడంతా రాష్ట్రస్థాయి నాయకులే ఉన్నారు. పైగా రాజకీయంలో రాటుదేలిన వారే. అయినా పంచాయతీ ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డారు. కనీసస్థాయిలో కూడా సత్తా చాట లేకపోయారు. అదే ఇప్పుడు టీడీపీలో చర్చకు దారితీస్తోంది. ఇంతకీ ఎవరా నాయకులు? అక్కడ పార్టీ ఉన్నట్టా.. లేనట్టా?
నంద్యాలలో టీడీపీకి దక్కింది రెండు పంచాయతీలే!
కర్నూలు జిల్లాలో జరిగిన తొలి విడత పంచాయతీ పోరులో టీడీపీ చతికిల పడిందా? కొన్ని నియోజకవర్గాల్లో ఓ మోస్తరు స్థానాలు దక్కించుకున్న తెలుగుదేశం.. కీలకమైన నంద్యాలలో చేతులు ఎత్తేసిందా? నంద్యాలపై పట్టున్న నాయకులు అక్కడి టీడీపీలో ఉన్నా.. ఆ ప్రభావం ఫలితాలపై కనిపించలేదన్న టాక్ వినిపిస్తోంది. తొలి విడతలో ఆళ్లగడ్డ, నంద్యాల, శ్రీశైలం నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆళ్లగడ్డలో 104 పంచాయతీలు ఉంటే.. టీడీపీకి 22 దక్కాయి. శ్రీశైలంలో ఏడుచోట్ల గెలిస్తే.. నంద్యాలలో సైకిల్కు దక్కింది రెండే. ఇప్పుడీ లెక్కలే పార్టీ నేతలను కలవర పరుస్తున్నాయట.
సీనియర్లు ఉన్నా పల్లెపోరులో చేదు ఫలితాలు!
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇటీవల కిడ్నాప్ కేసులో 18 రోజులపాటు హైదరాబాద్లో జైలులో ఉన్నారు. బెయిల్పై బయటకొచ్చిన తర్వాత పల్లెపోరుపై ఫోకస్ పెట్టారు. 22చోట్ల టీడీపీ జెండాను రెపరెపలాడించారు. నంద్యాలలోనే అంతా తారుమారైందనే ఆవేదన పార్టీ శిబిరంలో ఉందట. 2017లో జరిగిన నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలో టీడీపీకి 26 వేల ఓట్ల మెజారిటీ దక్కింది. టీడీపీ బాగా బలపడిందని అనుకున్నారు. కానీ అదంతా వాపేనని 2019 ఎన్నికల్లో తేలిపోయింది. ఆ ఎన్నికల్లో ఓడిన తర్వాత టీడీపీ పరిస్థితి మరింత దిగజారింది. మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి వంటి సీనియర్లు నంద్యాలలో ఉన్నా.. పంచాయతీ పోరులో చేదు ఫలితాలే వచ్చాయి.
నంద్యాల మండలంలో టీడీపీకి జీరో!
ఒకప్పుడు భూమా నాగిరెడ్డి ప్రాతినథ్యం వహించిన నియోజకవర్గం కావడంతో తప్పకుండా భూమా ఫ్యామిలీ ఇక్కడ పట్టు సాధిస్తుందని అంతా అనుకున్నారట. అసెంబ్లీ ఎన్నికలు ప్రతికూలంగా మారినా.. పల్లెల్లో పాగా వేస్తారని భావించింది కేడర్. కానీ.. రెండు పంచాయతీలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నియోజకవర్గంలో 32 పంచాయితీలు ఉంటే.. గోస్పాడు మండలంలోనే ఆ రెండు పల్లెలు దక్కాయి. నంద్యాల మండలంలో టీడీపీ ఖాతాలో ఒక్కటీ పడలేదు.
నేతలు కలిసి సాగకే సైకిల్ మొరాయించిందా?
నంద్యాల టీడీపీ ఇంఛార్జ్గా బ్రహ్మానందరెడ్డే ఉన్నారు. ఆయన చురుకుగా లేరన్నది క్యాడర్ చెప్పేమాట. టీడీపీ అధిష్ఠానం పిలుపు మేరకు అప్పుడప్పుడూ కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం తప్ప ఇతర విషయాలను ఆయన సీరియస్గా తీసుకోవడం లేదని సమాచారం. మాజీ మంత్రి NMD ఫరూక్ అనారోగ్య కారణాలతో చాలాకాలంగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఏవీ సుబ్బారెడ్డికి, భూమ ఫ్యామిలీకి మధ్య గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ టీడీపీ నేతలు కలిసి కట్టుగా సాగే వాతావరణం లేదు. అందుకే నంద్యాల పంచాయతీ పోరులో సైకిల్ మొరాయించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేడర్ సైతం తమ అవసరాలకు ఎవరి దగ్గర వెళ్లాలో తెలియడం లేదట. అందుకే నంద్యాలలో టీడీపీ ఉన్నట్టా.. లేనట్టా అని ప్రశ్నించుకుంటోంది పార్టీ కేడర్.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)