కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి నారా లోకేష్ లేఖ !
జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్డిసి) ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడ కేంద్రంగా కొనసాగించాలoటూ కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ కి నారా లోకేష్ లేఖ రాశారు. చేనేత కుటుంబాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశంలో ఏపీ 2వ స్థానంలో ఉందని పేర్కొన్న ఆయన రాష్ట్రంలో 3 లక్షలకు పైగా నేత కార్మికులు ఉన్నారని అన్నారు. ఎన్హెచ్డిసి విజయవాడలో బ్రాంచ్ కార్యాలయం స్థాపించిన నాటి నుంచి చేనేత ఆదాయంలో స్థిరమైన పెరుగుదల ఉందని, ఇందుకనుగుణంగా బ్రాంచ్ కార్యాలయం ప్రాంతీయ కార్యాలయంగా అభివృద్ధి చెందిందని అన్నారు.
ఇది హైదరాబాద్లోని ప్రాంతీయ కార్యాలయంతో సంబంధం లేకుండా మార్కెట్ సామర్థ్యాన్ని బట్టి నూలు సరఫరాలో చేనేత కార్మికులకు ఎంతో ప్రయోజనం చేకూర్చిందని ఆయన పేర్కొన్నారు. 200 కి పైగా చేనేత సహకార సంస్థలు మరియు అనుబంధ సంస్థలకు లబ్ది చేకూర్చిందన్న ఆయన తెలంగాణ ఎన్హెచ్డిసి టర్నోవర్ రూ.16కోట్ల వరకు ఉంటే విజయవాడ ప్రాంతీయ కార్యాలయం టర్నోవర్ రూ.80కోట్ల వరకు ఉందని అన్నారు. ఇటీవల హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం స్థాయిని బ్రాంచ్ కార్యాలయం గా కుదించినప్పటికీ మంత్రి కిషన్ రెడ్డి జోక్యంతో తిరిగి ప్రాంతీయ కార్యాలయంగా కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు.
తెలంగాణ ఎన్హెచ్డిసి కంటే ఎక్కువ టర్నోవర్, ఎక్కువ నేత కుటుంబాలు ఆధారపడిన విజయవాడ ప్రాంతీయ కార్యాలయం స్థాయిని ఇప్పుడు బ్రాంచ్ కార్యాలయం గా కుదించడం మంచి నిర్ణయం కాదని ఆయన పేర్కొన్నారు. విజయవాడ ప్రాంతీయ కార్యాలయం స్థాయిని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన లేఖలో పేర్కొన్నారు. విజయవాడ కార్యాలయం స్థాయి తగ్గించినందున సహకార సంఘాలు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ, నూలు డిపో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
గత ఆరు నెలల్లో, కరోనా మహమ్మారి ఖాదీ,చేనేత రంగాన్ని నాశనం చేసిందని, ఉత్పత్తులు అమ్ముడుపోక తీవ్ర నష్టాల్లో ఉన్నారని, కొత్త పని లేకుండా పోయిందని ఆయన అన్నారు. ఎన్హెచ్డిసి తాజా నిర్ణయం నేతన్నలు కోలుకునే అవకాశాలను మరింత దెబ్బతీస్తోందని అన్నారు. హైదరాబాద్ కార్యాలయం విషయంలో త్వరితగతిన ఎలా అయితే నిర్ణయం తీసుకున్నారో అలానే విజయవాడ ఎన్హెచ్డిసి కార్యాలయాన్ని తక్షణమే ప్రాంతీయ కార్యాలయంగా గుర్తించాలని లేఖలో కోరారు. దీని వలన నేతన్నలు వారి అవసరాలకు హైదరాబాద్ కార్యాలయం పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.సమయం వృధా కాకుండా వృత్తిని లాభదాయకంగా కొనసాగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)