దేశవ్యాప్తంగా ప్రధాని మోదీకి ఆదరణ ఉందని ఇప్పటికే పలు సర్వేలు నిరూపించాయి. అయితే దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా మన ప్రధాని మోదీకి ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మరో రికార్డు సాధించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాజకీయ నేతల్లో అత్యధిక సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్గా మోదీ యూట్యూబ్ ఛానల్ నిలిచింది. ఫిబ్రవరి 1 నాటికి ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబర్ల సంఖ్య కోటిని దాటింది. 2007లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు 164.31 కోట్ల వ్యూస్ సాధించింది.
Read Also: కేంద్ర బడ్జెట్ 2022: ధరలు పెరిగేవి? తగ్గేవి?
2019లో కాశీ పర్యటన సమయంలో దివ్యాంగులు మోదీకి వెల్కమ్ చెప్పిన వీడియోను అత్యధికంగా వీక్షించారు. 2019లోనే అప్పటి ఇస్రో ఛైర్మన్ శివన్తో మోదీ భావోద్వేగానికి లోనైన వీడియోకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మోదీని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ గంటసేపు ఇంటర్వ్యూ చేసిన వీడియోను ఎక్కువ మంది వీక్షించినట్లు తెలుస్తోంది. కాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యూట్యూబ్ ఛానల్కు 5.25 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉండగా.. మరో కాంగ్రెస్ నేత శశి థరూర్ ఛానల్కు 4.39 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అసదుద్దీన్ ఒవైసీ ఛానల్కు 3.73 లక్షల మంది, తమిళనాడు సీఎం స్టాలిన్ యూట్యూబ్ ఛానల్కు 2.12 లక్షల మంది, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఛానల్కు 1.37 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.
ప్రపంచ నాయకుల యూట్యూబ్ ఛానెళ్ల సబ్ స్క్రైబర్లను పరిశీలిస్తే… బ్రెజిల్ ప్రెసిడెంట్ బోల్సోనారో ఛానల్ 36 లక్షల మంది సబ్స్క్రైబర్లతో గ్లోబల్ లీడర్ల లిస్ట్లో రెండో స్థానంలో నిలిచింది. అటు మెక్సికన్ ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ 30.7 లక్షల మంది సబ్స్క్రైబర్లతో మూడో స్థానంలో ఉంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ యూట్యూబ్ ఛానల్కు 7.03 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.