టీమిండియా ఓపెనర్, యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్కు నిరాశ ఎదురైంది. డిసెంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్రకటించిన ప్రతిష్టాత్మక ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఎంపికయ్యాడు. ఈ అవార్డు రేసులో అజాజ్ పటేల్తో పాటు మాయంక్ అగర్వాల్, ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ ఉన్నప్పటికీ.. ఈ అవార్డు అజాజ్నే వరించింది.
భారత్-న్యూజిలాండ్ మధ్య ఇటీవల జరిగిన ముంబై టెస్టులో ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు పడగొట్టి అజాజ్ పటేల్ చరిత్ర సృష్టించాడు. గతంలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ నెలకొల్పిన రికార్డును అజాజ్ పటేల్ సమం చేశాడు. కాగా ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసిన అజాజ్ పటేల్కు ఐసీసీ సభ్యులతో పాటు భారత అభిమానులు సైతం భారీ ఎత్తున మద్దతు పలికారని ఐసీసీ ఓటింగ్ కమిటీ మెంబర్ జేపీ డుమిని తెలిపాడు. అజాజ్ సాధించిన రికార్డు టెస్టు క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడాడు.