పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి విషయంలో ఉత్కంఠకు తెరపడింది. పంజాబ్ సీఎం అభ్యర్థిని లుథియానా వేదికగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రకటించారు. ప్రస్తుత సీఎం చరణ్జిత్ సింగ్ చెన్నీయే పంజాబ్ సీఎం అభ్యర్థి అని స్పష్టం చేశారు. అయితే సీఎం అభ్యర్థి అవ్వాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న నవజ్యోత్ సిద్దూకు కాంగ్రెస్ అధిష్టానం మొండిచేయి చూపించింది. అధిష్టానం ఎప్పుడూ కూడా బలహీన సీఎంలనే కోరుకుంటుందని ఇటీవల సిద్దూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి.
Read Also: ఎన్నికల ప్రచారానికి ఆంక్షలను సడలించిన సీఈసీ
కాగా చెన్నీని ఎందుకు మరోసారి సీఎం అభ్యర్థి చేయాల్సి వచ్చిందో రాహుల్ గాంధీ వివరణ ఇచ్చారు. చెన్నీ పేద కుటుంబం నుంచి వచ్చిన నేత అని... పేదరికాన్ని పూర్తిగా అర్థం చేసుకోగల నేత అని తెలిపారు. ఆయన మనస్సులో, రక్తంలో కూడా పంజాబ్ ఉంటుందని… ఎవరికైనా అనుమానం వస్తే కోసి చూసుకోవచ్చని.. అప్పుడు ఆ రక్తంలో పంజాబ్ అనే ఉంటుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. గత కొన్నిరోజులుగా సీఎం అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సిద్దూ, సీఎం చెన్నీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దీంతో సీఎం అభ్యర్థిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.