గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ పీరియాడిక్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (PEDDI). ‘రంగస్థలం’ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న పక్కా పల్లెటూరి ఇంటెన్స్ ఎమోషనల్ ఫిల్మ్ కావడంతో దీనిపై అంచనాలు స్కై హై లో ఉన్నాయి. అయితే, మొదటి నుంచీ ఈ సినిమాను ఒక ‘మల్టీ స్పోర్ట్స్ డ్రామా’ (Sports Drama) గానే చిత్రబృందం ప్రొజెక్ట్ చేస్తూ వస్తోంది.
ఇటీవల విడుదలైన అఫీషియల్ ట్రైలర్లో సైతం రామ్ చరణ్ను ఒక అథ్లెట్/స్పోర్ట్స్ మ్యాన్గా ఎలివేట్ చేస్తూ అసలు కథను దాచిపెట్టారు. కానీ, ఫిలిం నగర్ తాజా విశ్లేషణల ప్రకారం.. ఈ సినిమాలో స్పోర్ట్స్ అనేది కేవలం ఒక భాగం మాత్రమేనట. ‘పెద్ది’ గాడి అసలు సిసలైన పోరాటం స్పోర్ట్స్ కోసం కాదు, మరేంటి?.. బుచ్చిబాబు సన మొదటి నుంచీ ఈ సినిమా కథపై చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. ట్రైలర్లో కేవలం క్రీడల నేపథ్యాన్ని మాత్రమే చూపించి అందరినీ ఒక మైండ్గేమ్తో పక్కదారి పట్టించినప్పటికీ.. సినిమా అంతర్లీనంగా ఒక బలమైన సామాజిక సమస్య చుట్టూ తిరగబోతోందని తెలుస్తోంది. తాజాగా విడుదలైన కొత్త పోస్టర్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
చిత్ర పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం.. ‘పెద్ది’ సినిమా క్రీడల చుట్టూ కాకుండా ఒక ‘రైల్వే ట్రాక్’ (Railway Track) అంశం మీదే ప్రధానంగా నడవబోతోంది. సినిమాలో పలు రకాల గ్రామీణ క్రీడలు (కబడ్డీ, రన్నింగ్ వంటివి) ఉన్నప్పటికీ.. కథానాయకుడు ‘పెద్ది’ చేసే అసలు సిసలైన యుద్ధం తన సొంత ఊరి ఉనికి కోసం, తన గ్రామానికి ఒక రైల్వే ట్రాక్/రైల్వే కనెక్టివిటీ సాధించడం కోసమేనని ఇండస్ట్రీ టాక్. ఈ రైల్వే లైన్ సాధించే క్రమంలోనే పల్లెటూరి వాడైన పెద్ది ఏకంగా దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లడం, అక్కడ ప్రభుత్వ పెద్దలకు అర్జీలు పెట్టుకోవడం, ఆ తర్వాత వచ్చే అడ్డంకులను తనదైన శైలిలో ఎదుర్కోవడం వంటి అంశాలు సినిమాలో అత్యంత కీలకమైన ఎమోషనల్ హైలైట్స్గా ఉండబోతున్నాయి. బుచ్చిబాబు సన ఈ ‘రైల్వే ట్రాక్’ హింట్స్ను సినిమా అనౌన్స్మెంట్ చేసిన రోజు నుంచే ఇస్తూ రావడం గమనార్హం. సినిమా పూజా కార్యక్రమాల సమయంలో వదిలిన ఆఫీషియల్ గ్లింప్స్ మరియు ఫస్ట్ కాన్సెప్ట్ పోస్టర్లలో ట్రైన్ విజువల్స్ స్పష్టంగా కనిపించాయి. ఆ తర్వాత రామ్ చరణ్ పుట్టినరోజున వదిలిన ఒక పోస్టర్ కూడా ఆయన రైల్వే ట్రాక్ పక్కన నిలబడినట్లు డిజైన్ చేశారు. అంతెందుకు, రీసెంట్గా వచ్చిన ట్రైలర్లో సైతం మొదటి షాట్ ఒక రైల్వే ట్రాక్ మీదనే ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత కూడా కొన్ని సీన్లలో రైల్వే బ్యాక్డ్రాప్ కనిపిస్తుంది.
బుచ్చిబాబు చాలా తెలివిగా ఈ హింట్స్ను వదిలేసి, స్క్రీన్ ప్రెజెన్స్లో మాత్రం స్పోర్ట్స్ను హైలైట్ చేశారు. ఒకవేళ ఈ రైల్వే ట్రాక్ సెంటిమెంట్ మరియు రూరల్ ఎమోషన్స్ గనుక థియేటర్లలో వర్కవుట్ అయితే.. రామ్ చరణ్ నుండి ‘రంగస్థలం’ రేంజ్ ఇంటెన్స్ ఎమోషనల్ పవర్ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ను ప్రేక్షకులు చూడటం ఖాయం. ఈ మైండ్ బ్లోయింగ్ ప్లాన్ వెనుక అసలు ట్విస్ట్ ఏంటో తెలియాలంటే జూన్ 4న సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే!
